తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి అనారోగ్యంతో హైదరాబాద్ లో మృతి చెందారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడిగా , రాజకీయ వ్యూహకర్తగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మంచి పేరుంది.
చిత్తూరు జిల్లాలోని ప్రముఖ రాజకీయ కుటుంబంలో బొజ్జల జన్మించారు. తండ్రి సుబ్బిరామిరెడ్డి ఏం. ఎల్. ఎ గా పనిచేయడం జరిగింది. ఒకప్పటి చిత్తూరు జిల్లా రాజకీయ దిగ్గజం పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి కుమార్తెను వివాహాం చేసుకున్నారు. విద్యార్థి దశలోనే రాజకీయాల్లో అడుగుపెట్టి 1981 లో శ్రీకాళహస్తి దేవస్థానం మండలి సభ్యుడిగా పనిచేయడం జరిగింది.
తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఆ పార్టీలో చేరిన బొజ్జల తొలుత శ్రీకాళహస్తి దేవస్థానం బోర్డు అధ్యక్షుడు గా పనిచేశారు. 1989లో తెలుగుదేశం పార్టీ నుండి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గా ఎన్నికవ్వడం జరిగింది. ఆతర్వాత 1994, 1999, 2009 మరియు 2014 లలో శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2019లో అనారోగ్యం కారణంగా క్రియాశీలక రాజకీయాల నుండి విరమించారు.
1996 -2004 వరకు చంద్రబాబు మంత్రివర్గంలో కీలకమైన మంత్రివర్గ శాఖలు నిర్వహించిన బొజ్జల , 2014-17 వరకు నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడ్డ తొలి చంద్రబాబు మంత్రివర్గంలో అటవీ, పర్యావరణ, సహకార మరియు సాంకేతిక అభివృద్ధి శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
బొజ్జల మంచి వక్త మరియు రాజకీయ వ్యూహకర్త . తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో అధినేత చంద్రబాబు నాయుడు కు అండగా నిలిచిన అతికొద్ది మంది నాయకుల్లో బొజ్జల ఒకరు. చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తూ వచ్చారు.
బొజ్జల కుమారుడు సుధీర్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. రేపు ఆయన మృతదేహాన్ని హైదరాబాద్ నుండి స్వగ్రామమైన ఊరందూరు కు తరలించనున్నారు.